JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 8:13 pm Posted by : JANA SANGARSHANA

యూరియా కొరతపై రైతుల ఆందోళన

– జానకంపేట్‌లో సొసైటీ ఎదుట నిరసన.

ఎడపల్లి: ఫిబ్రవర, 27జన సంఘర్షణ

ఎడపల్లి మండలంలో జానకంపేట్ గ్రామంలో యూరియా కొరత సమస్య తీవ్రరూపం దాల్చింది. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం పరిధిలో ఉన్న ఈ గ్రామంలో రైతులు వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. సరైన సమయంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు నష్టపోతున్నామని,, దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం ఎరువుల గిడ్డంగికి తాళం వేసి తమ నిరసనను వ్యక్తపరిచారు. రైతుల ఆందోళన ప్రకారం, ప్రస్తుత యూరియా కేటాయింపు విధానం స్థానిక రైతులకు అనుకూలంగా లేదని ఆరోపిస్తూ, గ్రామ అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ఇతర ప్రాంతాల రైతులకు అధిక కేటాయింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముందుగా జానకంపేట్ గ్రామ రైతుల అవసరాలను గుర్తించి యూరియా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తూ, పంటల కీలక దశలో ఎరువుల కొరత తీవ్ర నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్‌లైన్ బుకింగ్ విధానం కూడా సమస్యగా మారిందని రైతులు తెలిపారు. చాలామందికి డిజిటల్ విధానంపై అవగాహన లేకపోవడంతో సమయానికి యూరియా పొందలేకపోతున్నారని చెప్పారు. గతంలో ఉన్న ప్రత్యక్ష పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అవసరమైన యూరియా సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సరఫరా ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలియజేశారు. అధికారుల హామీతో రైతులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.