తెలంగాణ హైకోర్టు (అడ్మినిస్ట్రేటివ్ అండ్ పోర్ట్ఫోలియో) గౌరవ న్యాయమూర్తి జస్టిస్ జే. శ్రీనివాసరావును ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని పలు న్యాయపరమైన సమస్యలను, కోర్టుల పురోగతిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా ఇల్లందులో నూతనంగా మంజూరైన సబ్ కోర్టు ప్రారంభంతో పాటు, నూతన కోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు గౌరవ న్యాయమూర్తికి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. స్థానిక న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వివరించారు.
న్యాయవాదులు సమర్పించిన వినతిపత్రంపై గౌరవ జడ్జి జస్టిస్ జే. శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. నూతన కోర్టు భవన నిర్మాణ పనుల పురోగతిపై, సబ్ కోర్టు ఏర్పాటుకు సంబంధించిన వివరాలపై ఆయన సానుకూల వివరణలు కోరారు. అనంతరం, ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూక్యా రవికుమార్ నాయక్ మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు గౌరవ న్యాయమూర్తిని శాలువాతో ఘనంగా సత్కరించారు.


