Homeన్యూ ఢిల్లీఢిల్లీ మాలవీయ నగర్ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం: 20 మంది మృతి

ఢిల్లీ మాలవీయ నగర్ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం: 20 మంది మృతి

📰 Generate e-Paper Clip

దేశ రాజధాని ఢిల్లీలోని దక్షిణ ప్రాంతమైన మాలవీయ నగర్‌లో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ భవనంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఉదయం 9:45 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేయడానికి 10కి పైగా ఫైర్ ఇంజన్లు, వాటర్ టెండర్లు, క్విక్ రెస్పాన్స్ వాహనాలతో కూడిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో భవనం లోపల జనం ఊపిరాడక, బయటకు రాలేక చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి దట్టమైన పొగలో బేస్‌మెంట్‌లోకి వెళ్లి, అక్కడ చిక్కుకున్న ముగ్గురిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు.

భవనం పై అంతస్తుల్లో ఉన్న మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీలు, బాల్కనీల నుండి కిందకు దూకారు. ఆ సమయంలో స్థానికులు మానవత్వంతో స్పందించి, రోడ్డుపై పరుపులు, మెత్తలు పరిచి వారిని కాపాడారు. మొత్తంగా 37 మందిని సురక్షితంగా రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, సదరు భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు (Fire Safety Rules) పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular